వాట్సాప్ గ్రూప్ – బంధాల వేదికా? అహంకారాల అడ్డా?
చదివారు... కానీ పలకరించలేదు!
వాట్సాప్లో వేల సందేశాలు... మనసుల్లో మాత్రం దూరాలు!
శుభాకాంక్షలు మాయమైతే... బంధాలు కూడా మాయమవుతాయా?
ఆన్లైన్లో కలిసి... నిజ జీవితంలో దూరమైపోతున్నామా?
ఈ ప్రశ్నలు కఠినంగా అనిపించవచ్చు. కానీ నేటి వాట్సాప్ గ్రూపుల పరిస్థితిని గమనిస్తే ఇవి కేవలం ప్రశ్నలు కాదు... మన ప్రవర్తనకు అద్దం పట్టే నిజాలు.
ఒక గ్రూపులో ఎవరికైనా పుట్టినరోజు వస్తుంది. కొందరు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతారు. మరికొందరు చూస్తారు, చదువుతారు, కానీ స్పందించరు.
ఎందుకు?
సమయం లేదా?
లేదా ఆసక్తి లేదా?
లేదా "నేను ఎందుకు విష్ చేయాలి?" అనే భావనా?
ఒకరి విజయ వార్త వస్తుంది.
మనస్ఫూర్తిగా అభినందిస్తామా?
లేక...
"ఇతనికే ఎందుకు వచ్చింది?" అని లోలోపల బాధపడతామా?
ఒకరి పిల్లవాడు మంచి ర్యాంక్ సాధిస్తే...
"అభినందనలు" అని చెప్పగలమా?
లేక...
"ఇందులో గొప్పదేముంది?" అని తేలిగ్గా తీసుకుంటామా?
ఒకరి కుటుంబంలో కష్టం వస్తే...
ఒక్క ఓదార్పు మాట చెప్పగలమా?
లేక...
"మనకెందుకులే" అని పక్కకు తప్పుకుంటామా?
ఇలాంటి ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానాలే మన వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి.
వాట్సాప్ గ్రూప్: స్నేహాల కంటే స్వార్థాలే ఎక్కువా?
కొన్నిసార్లు గ్రూప్లో మనం గమనించే దృశ్యం విచిత్రంగా ఉంటుంది.
తనకు సంబంధించిన విషయం వస్తే వెంటనే స్పందించే వ్యక్తి...
ఇతరుల విషయానికి మాత్రం మౌనంగా ఉంటాడు.
తన పుట్టినరోజుకు అందరూ విష్ చేయాలని ఆశించే వ్యక్తి...
ఇతరుల పుట్టినరోజు వచ్చినప్పుడు కనిపించడు.
తన విజయానికి చప్పట్లు కోరుకునే వ్యక్తి...
ఇతరుల విజయానికి మాత్రం చేతులు జేబులో పెట్టుకుంటాడు.
ఇది స్నేహమా?
లేక స్వార్థమా?
ఒక "విష్" కూడా భారమైపోయిన కాలమా?
ఒకప్పుడు బంధువుల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవారు.
ఫోన్ చేసి పలకరించేవారు.
ఇప్పుడు కేవలం కొన్ని అక్షరాలు టైప్ చేస్తే సరిపోతుంది.
అయినా చాలామందికి అది కూడా భారంగా మారింది.
నిజంగా బిజీగా ఉన్నామా?
లేక...
మనసు చిన్నదైపోయిందా?
వాట్సాప్ గ్రూపులు – మనుషులను కలుపుతున్నాయా? విడదీస్తున్నాయా?
సాంకేతికత మనుషులను దగ్గర చేయడానికి వచ్చింది.
కానీ మన ఆలోచనలు, మన అహంకారాలు, మన అసూయలు పెరిగితే అదే సాంకేతికత దూరాలను కూడా పెంచుతుంది.
గ్రూప్లో స్పందించని వ్యక్తి తప్పనిసరిగా చెడ్డవాడు కాదు.
కానీ ఎప్పుడూ ఇతరులను పట్టించుకోకుండా ఉండే వ్యక్తి తన గురించి తానే ఒక సందేశం ఇస్తున్నాడు.
ఆ సందేశం ఏమిటంటే...
"నాకు నేను ముఖ్యుడు... మిగతావాళ్లు తర్వాత."
డిజిటల్ బంధాలు... భావోద్వేగ దివాళా?
మనం రోజుకు వందల సందేశాలు చదువుతాం.
వందల స్టేటస్లు చూస్తాం.
అనేక పోస్టులకు లైక్లు పెడతాం.
కానీ...
మనకు తెలిసిన వ్యక్తి సంతోషంలో భాగస్వామి కావడానికి, బాధలో ఓదార్పు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు.
ఇది టెక్నాలజీ సమస్య కాదు.
ఇది మనసుల సమస్య.
మరి పరిష్కారం ఏమిటి?
ఇతరుల ఆనందాలను అభినందిద్దాం.
విజయాలను చూసి అసూయ కాదు, ప్రోత్సాహం అందిద్దాం.
బాధలో ఉన్నవారికి ఓదార్పు మాట చెప్పుదాం.
గ్రూప్ను కేవలం సందేశాల వేదికగా కాకుండా బంధాల వేదికగా మార్చుకుందాం.
"నాకు ఏమి లాభం?" అనే ఆలోచనకు బదులుగా...
"నా వల్ల ఎవరికైనా సంతోషం కలుగుతుందా?" అని ఆలోచిద్దాం.
ఎందుకంటే...
వాట్సాప్ గ్రూప్లో మనం పంపే మెసేజ్లు కాదు... మనం చూపించే మనసే మన వ్యక్తిత్వానికి నిజమైన అద్దం.
చదివి స్పందించకపోవడం ఒక అలవాటు కావచ్చు...
కానీ ఇతరుల ఆనందాన్ని పంచుకోవడం ఒక సంస్కారం.
బాధలో తోడుగా నిలవడం ఒక మానవత్వం.
అందుకే...
🌹 మనుషులను గుర్తుంచుకుందాం...
🌹 బంధాలను గౌరవిద్దాం...
🌹 స్నేహాలను నిలబెట్టుకుందాం...
🌹 మన శుభాకాంక్షలతో మరొకరి జీవితంలో ఆనందాన్ని నింపుదాం...
✍️ తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా
కవి • కథారచయిత • వ్యాసకర్త
No comments:
Post a Comment