నాన్న నాటిన నేరేడు నాట్లు
"నాన్న నాటిన నేరేడు నాట్లు, నేరేడు నాట్లలో నాన్న నాటిన నాట్లు..." అంటూ చిన్నప్పటి నుండి తన నాన్న చెప్పే మాటలను రాము సరదాగా టంగ్ ట్విస్టర్గా భావించేవాడు. ఆ మాటల్లోని అసలు అర్థం మాత్రం అతనికి అప్పుడు తెలియదు.
రాము నాన్న వెంకటయ్య ఒక సాధారణ రైతు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఇంటి చుట్టూ, పొలాల అంచుల్లో మొక్కలు నాటేవాడు. ముఖ్యంగా నేరేడు మొక్కలంటే ఆయనకు చాలా ఇష్టం.
"నాన్నా! ఈ మొక్కలు మనకు ఏం ఇస్తాయి?" అని చిన్నప్పుడు రాము అడిగేవాడు.
వెంకటయ్య చిరునవ్వుతో,
"నేను తినడానికి కాదు బాబూ... నువ్వు, నీ పిల్లలు, ఈ ఊరి వాళ్లు తినడానికి!" అనేవాడు.
కాలం గడిచింది. రాము చదువుకుని ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్లిపోయాడు. నాన్న మాత్రం గ్రామాన్నీ, మొక్కలనూ వదల్లేదు. ప్రతి సంవత్సరం కొత్త మొక్కలు నాటుతూనే ఉన్నాడు.
ఒకరోజు అనారోగ్యంతో వెంకటయ్య కన్నుమూశాడు.
కొన్ని సంవత్సరాల తరువాత రాము తన పిల్లలతో కలిసి ఊరికి వచ్చాడు. ఇంటి ముందు ఒకప్పుడు చిన్నగా కనిపించిన నేరేడు మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా ఎదిగిపోయాయి. చెట్లన్నీ పండ్లతో కళకళలాడుతున్నాయి. పక్షులు కిలకిలరావాలు చేస్తూ ఆనందంగా ఎగురుతున్నాయి. పిల్లలు చెట్ల నీడలో ఆడుకుంటున్నారు.
ఆ దృశ్యం చూసి రాము కళ్లలో నీళ్లు తిరిగాయి.
అప్పుడే అతనికి చిన్నప్పుడు నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది.
"నేను తినడానికి కాదు బాబూ... నువ్వు, నీ పిల్లలు, ఈ ఊరి వాళ్లు తినడానికి!"
ఆ రోజు రాము తన పిల్లలను పిలిచి ఒక నేరేడు మొక్కను చేతిలో పెట్టాడు.
"తాతయ్య నాటిన చెట్లు మనకు నీడనిచ్చాయి. ఇప్పుడు మన వంతు వచ్చింది. మనం నాటే మొక్కలు రేపటి తరాలకు ఆశ్రయం కావాలి" అన్నాడు.
పిల్లలు ఉత్సాహంగా మొక్కలు నాటారు.
ఆ క్షణంలో రాము మనసులో ఒక నిజం స్పష్టమైంది.
నాన్నలు కేవలం పిల్లలను పెంచరు. తమ ఆలోచనలతో, విలువలతో, సేవాభావంతో తరాలను పెంచుతారు.
అందుకే ప్రతి చెట్టు నీడలో, ప్రతి మంచి పనిలో, ప్రతి సత్కార్యంలో ఒక నాన్న కనిపిస్తాడు.
నాన్న నాటిన నేరేడు నాట్లు కేవలం చెట్లు కాదు... ఆయన ప్రేమకు, దూరదృష్టికి, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యాలు.
నీతి:
"మనం నేడు చేసే మంచి పని, రేపటి తరాలకు వరంగా మారుతుంది." 🌱🌳❤️
తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా
కవి • కథారచయిత • వ్యాసకర్త

No comments:
Post a Comment